Sunday, March 8, 2009

రవ్వ దోశ

కావాల్సినవి:
బొంబాయి రవ్వ- ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
మైదా పిండి- అర కప్పు
పుల్లటి మజ్జిగ- ఒక గ్లాస్
అల్లం- పక చిన్న ముక్క
పచ్చిమిర్చి- ఐదు
జీలకర్ర- 2 టీ స్పూన్లు
నూనె- 50 గ్రా
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా బొంబాయి రవ్వ,మైదా పిండి,బియ్యప్పిండి లను శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి.తరువాత ఈ మూడింటిని పుల్లటి మజ్జిగలో వేసి బాగా కలుపుకొని కొంత సమయం నాననివ్వాలి.
2 ) తరువాత ఇందులో ఉప్పు కలుపుకుని బాగా కాలిన పెనంఫై దోశలు పోసుకుని వాటి ఫై జీలకర్ర,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి. ఒక వైపు బాగా వేగిన తరువాత రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి దోశ ను తీసుకోవాలి.అంతే వేడి వేడి రవ్వ దోశలు రెడీ... ,ఇవి కొబ్బరి చట్నీ తో బావుంటాయి....







Thursday, March 5, 2009

సబ్జీ గోస్ట్

కావాల్సినవి:
మటన్- 500 గ్రా
పాలకూర- 10 కట్టలు
నూనె- 70 మీ.లీ
అల్లంవెల్లుల్లి- 30 గ్రా
కారం- 15 గ్రా
పసుపు- 5 గ్రా
టమోటాలు- 200 గ్రా
గరంమసాలా -5 గ్రా
మెంతి కూర-4 కట్టలు
ఉల్లిపాయలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసాక,బాగా కడిగి తరిగిన మెంతికూరను వేసి ఫ్రై చేసాక,అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేయండి.తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,పసుపు వేసి అందులోనే కడిగి శుభ్రం చేసిన మటన్ ను వేసి బాగా కలియబెట్టండి.తరువాత తగినంత ఉప్పు కూడా చేర్చి మూత పెట్టి ఉడికించండి.
2 ) మటన్ ఉడుకుతుండగా అవసరమైతే కొన్ని నీళ్లు చల్లండి. మాంసం ఉడకగానే శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరను,టమోటా ముక్కల్ని కూడా వేసి కలియబెట్టి బాగా ఉడికించండి. దాంతో పాలకూర కూడా ఉడికి సబ్జీ గోస్ట్ తయారు అవుతుంది.దించే ముందు గరం మసాలా చల్లి,వేడిగా పులావ్ తో గాని,వైట్ రైస్ తోగాని వడ్డించండి.

చుర్మా లడ్డు

కావాల్సినవి:
గోధుమపిండి- 500 గ్రా
నెయ్యి- ఫ్రై చేసేందుకు సరిపడా
చక్కెర పొడి- 400 గ్రా
యాలకుల పొడి-10 గ్రా
జీడి పప్పు- 25 గ్రా
కిస్ మిస్ లు- 25 గ్రా
తయారు చేసే విధానం:
1 ) గోధుమపిండిలో కొద్దిగా నెయ్యి కలిపి,తరువాత కొద్దిగా నీళ్లు జల్లుతూ పిండిని పొడి పొడి గా కలియబెట్టండి. ఈ పిండిని పది నిమిషాల పాటు తడి బట్టతో కప్పి వుంచండి.
2) తరువాత ఆ పిండిని గట్టిగా కలిపి పిడికిలికి సరిపడా పరిణామంలో చుట్టండి.వీటిని బాణలిలో సన్నటి మంట మీద మరుగుతున్న నెయ్యిలో ఎర్రగా ఫ్రై చేసి తీసి చల్లారబెట్టి పొడిగా దంచి,నూకల జల్లెడలో జల్లెడ పట్టి పక్కన వుంచండి.
3) ఇప్పుడు ఇలా చేసిన గోధుమ చుర్మాలో చక్కెర పొడి,యాలకుల పొడి,జీడిపప్పు,కిస్ మిస్ లను కలిపి ,కొంచెం తడి చేతితో కావాల్సిన పరిణామంలో లడ్డూలు గా చుట్టి గట్టిపడ్డాక ఆరగించండి......................

ఉల్లి గారెలు

కావాల్సినవి:
మినపప్పు- 500 గ్రా
ఉల్లిపాయలు- 250 గ్రా
అల్లం- చిన్న ముక్క
పచ్చి మిర్చి- పది
కరివేపాకు- పది రెబ్బలు
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా


తయారు చేసే విధానం:
1) మినపప్పును కడిగి నానబెట్టండి. రెండు గంటలతరువాత దీన్ని గట్టిగా ఉండేలా గ్రైండ్ చేయండి.(అంటే పప్పు పలుకుగా ఉండాలి)తగినంత ఉప్పు కలపండి.గ్రైండ్ చేసే ముందు నీళ్లు ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
2 ) ఇప్పుడు తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలు,కరివేపాకు గ్రైండ్ చేసిన పిండిలో కలపండి.
3 ) ఈ పిండిని ముద్దలుగా చేసి తడిచేతి మీద పలుచగా అద్ది -బాణలిలో కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించండి. అంతే ఎంతో రుచికరం అయిన ఉల్లిగారెలు రెడీ..ఇవి కొబ్బరి చట్నీ తో తింటే చాలా బావుంటాయి....

పొంగలి పులావ్

కావాల్సినవి:
బాసుమతి బియ్యం- 500గ్రా
పెసరపప్పు- 200 గ్రా
నెయ్యి- 75 గ్రా
జీలకర్ర- 15 గ్రా
గరం మసాల- 5 గ్రా
పుదీనా- 2 కట్టలు
ఉల్లిపాయలు- 50 గ్రా
అల్లం-25 గ్రా
క్యారెట్- 100 గ్రా
బీన్స్- 100 గ్రా
బంగాళదుంపలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
పచ్చిమిర్చి- ఆరు
తయారు చేసే విధానం:
1) పెసరపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసి,బియ్యం తో కలిపి బాగా కడిగి నీళ్లు వడపోసి ఉంచండి.
2) తరువాత స్టవ్ మీదున్న గిన్నెలో నెయ్యి వేసి వేడిచేసాక జీలకర్ర,గరం మసాలాల్ని వేసి ఫ్రై చేయండి.తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చిమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,పుదీనా,ముక్కలుగా తరిగిన కూరగాయలు వేసి ఇంకా ఫ్రై చేసి దానిలో వడగట్టిన బియ్యం,పెసరపప్పుల్ని కలిపి దోరగా వేయించండి.
3) ఇప్పుడు అదే గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి,తగినంత ఉప్పు కలిపి మూత పెట్టి మూడొంతులు ఉడికాక,పులావును గరిటెతో ఒక సారి బాగా కలియబెట్టి సన్నటి మంట మీద పూర్తిగా ఉడికేవరకు ఉంచి,దించి, గ్రేవీతో వడ్డిస్తే బావుంటుంది.

వెజిటబుల్ పిన్ వీల్స్

కావాల్సినవి:
బ్రెడ్ స్లయిస్లు -ఆరు
బఠానీలు- 50 గ్రా
బంగాళదుంపలు - 50 గ్రా
ఉల్లిపాయలు-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
పసుపు-చిటికెడు
వెన్న- 100 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 ) ఒక గిన్నెలో కొంచెం వెన్న వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించాక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఆ తరువాత ఉడికించి,మెత్తగా చేసిన బంగాళాదుంపల గుజ్జును వేసి కలియబెడుతూ,ఉడికించిన బఠానీలు కూడా కలిపి,దానికి కొంచెం పసుపు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలిపి కూరను తయారు చేయండి.
2) తరువాత ఒక్కో బ్రెడ్ స్లయిస్ కు పక్క బాగాలు కోసి వాటి పైన తయారు చేసిన ఆలు కూరను పూసి బ్రెడ్ స్లయిస్ ను ఒక సైడ్ నుండి చాపలా చుట్టండి.ఇలా చుట్టిన బ్రెడ్ రోల్ విడిపోకుండా ఎడం ఎడంగా రెండు టూత్ పిక్స్ గుచ్చండి. ఆ తరువాత పుల్లకు పుల్లకు మద్య గా చాకు తో కొస్తే ఒక్కో చుట్ట రెండు ముక్కలుగా అవుతుంది.
3) ఇప్పుడు పెనం మీద వెన్న వేసి,స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద బ్రెడ్ రోల్ల్స్ ను కలియబెడుతూ ఎర్రగా ఫ్రై చేసి,టమోటా సాస్ తో ఆరగించండి.

చికెన్ క్రీమ్ స్టిక్స్

కావాల్సినవి:
చికెన్ (ఎముకలు లేనిది)- 250 గ్రా
వేరుసెనగ గుళ్ళు- 25 గ్రా
పెరుగు మీగడ- 30 గ్రా
నిమ్మకాయ- అర చెక్క
అల్లం-చిన్న ముక్క
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-నాలుగు
యాలకులు-మూడు
ఉప్పు-తగినంత
నూనె-రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో ఎముకలు లేని చికెన్ ముక్కల్ని వేసి,వాటిని ఫ్రై చేసి ముద్ద గా నూరిన వేరుసెనగ గుళ్ళు,పెరుగుమీగడ,తురుమిన అల్లం,సన్నగా తరిగిన పచ్చిమిరపకాయముక్కలు,దంచిన యాలకులు,తగినంత ఉప్పు కలిపి ఒక గంట సేపు నానబెట్టండి.
2 ) తరువాత నానిన ఒక్కో చికెన్ ముక్కను సన్నని వెదురు పుల్లకు గుచ్చి బొగ్గుల వేడి మీదగాని,గ్రిల్లర్ లో గాని,గ్యాస్ మంట మీదగాని కాల్చి,వెజిటబుల్ సలాడ్,నిమ్మ చెక్కలతో అతిధులకు అందించండి.